అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న దస్తగిరి పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ

  • వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి
  • అవినాశ్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ పిటిషన్
  • ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు 
వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలంటూ ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయడం తెలిసిందే. దస్తగిరి పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. సీబీఐతో పాటు ఎంపీ అవినాశ్ రెడ్డికి, వివేకా కుమార్తె సునీతారెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. 

వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ దస్తగిరి తన పిటిషన్ లో పేర్కొన్నాడు. సాక్షులను ప్రభావితం చేయరాదు, సాక్ష్యాలను తారుమారు చేయరాదు అన్న బెయిల్ నిబంధనలను అవినాశ్ రెడ్డి అతిక్రమించారని దస్తగిరి ఆరోపించాడు. 

అప్రూవర్ గా తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకుంటే రూ.20 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారని, లేకపోతే తన కుటుంబం తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారని దస్తగిరి పేర్కొన్నాడు.

YS Avinash Reddy
Dastagiri
Bail
YS Viveka Murder Case
Telangana High Court

More Telugu News